డ్రగ్స్ మహమ్మారికి యువత దూరంగా ఉండాలి
• ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్
న్యూస్ పవర్ , 22 జూన్ , ఇల్లంతకుంట:
యువత, విద్యార్థులు డ్రగ్స్ వంటి మహమ్మారులకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ పిలుపునిచ్చారు. సోమవారం ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో ఎస్సై ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. ముఖ్యంగా 16 సంవత్సరాలు పైబడిన విద్యార్థులు, యువత ఎక్కువగా ఈ డ్రగ్స్ బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడాల్సిన వయసులో ఇలాంటి వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.
రహీంఖాన్ పేట పరిసర ప్రాంతాల్లో ఎవరైనా మాదకద్రవ్యాలు విక్రయించినా లేదా వాడుతున్నట్లు అనుమానం వచ్చినా వెంటనే ప్రభుత్వం కేటాయించిన టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. అలాగే విద్యార్థులు మెయిల్ ద్వారా కూడా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం విద్యార్థులందరితో డ్రగ్స్ నివారణపై ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో రహీంఖాన్ పేట గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
