ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్
న్యూస్ పవర్, 12 మార్చి, ఇల్లంతకుంట
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇల్లంతకుంటలోని శ్రీవాణి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ (AISF) జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని వెంకటపూర్, తిప్పాపూర్ గ్రామ శివార్లలో సదరు పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు అతివేగంతో పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు.
ఈ సందర్భంగా మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై పలు కీలక విమర్శలు చేశారు సదరు బస్సు డ్రైవర్ గతంలోనూ పలుమార్లు అతివేగంగా వాహనాన్ని నడుపుతూ విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడని, ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. పాఠశాల భవనానికి చుట్టూ రక్షణ గోడ (ఫెన్సింగ్) లేకపోవడం, తరగతి గదులు ఇరుకుగా ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా పాఠశాలను నడుపుతున్నారని మండిపడ్డారు అనుమతులు లేని ప్రైవేట్ బస్సులు రోడ్లపై తిరుగుతున్నా ఆర్టీఓ (RTO) మరియు విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక యాజమాన్యంతో కుమ్మక్కయ్యారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇటువంటి పాఠశాలల్లో పిల్లలను చేర్పించి, తర్వాత బాధపడవద్దని తల్లిదండ్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల భవిష్యత్తు మరియు ప్రాణాలతో ఆడుకుంటున్న శ్రీవాణి పాఠశాలపై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి, వెంటనే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.
