మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ముఠా ను పట్టుకున్న బెల్లంపల్లి పోలీసులు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో తొమ్మిది మంది నకిలీ మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. బెల్లంపల్లి సర్కిల్ కార్యాలయంలో రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి.. వారిని మీడియా ఎదుట హాజరుపరిచారు.
పట్టణంలోని కాల్ టెక్స్ టీ జంక్షన్ వద్ద బిక్షపతి అనే నకిలీ మావోయిస్టును పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 1991 నుంచి 1996 వరకు పీపుల్స్ వార్ పార్టీ సభ్యునిగా భిక్షపతి పని చేశాడని.. 1996లో వరంగల్ ఎస్పీ ముందు లొంగిపోయాడని పోలీసులు పేర్కొన్నారు. మరికొంతమందితో కలిసి ముఠాగా ఏర్పడి బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు.ముఠాగా ఏర్పడిజనగాం జిల్లా తమ్మడపల్లి గ్రామానికి చెందిన వడ్లకొండ రాజ్కుమార్, హైదరాబాద్ బోరబండకు చెందిన మోటమర్రి ప్రదీప్ కుమార్, గూడాకు చెందిన మహమ్మద్ మతిన్ అలీ, మందమర్రికి చెందిన తుంగ క్రాంతికుమార్, వరంగల్ జిల్లాకు చెందిన రాగుల రాజశేఖర్, మహమ్మద్ ఆఫజల్, హైదరాబాద్కు చెందిన మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, రాగుల తిరుపతి ముఠాగా ఏర్పడి ప్రజలను బెదిరిస్తున్నట్లు సీపీ వివరించారు.వరంగల్ జిల్లాకు చెందిన పునీత్ భారతి పరారీలో ఉన్నట్లు సీపీ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. అందుగుల శ్రీనివాస్ అనే మరో వ్యక్తి ప్రస్తుతం జైల్లో ఉండి స్థానికంగా డబ్బున్న వారి సమాచారం అంతా వీరికి చేరవేశారని వెల్లడించారు. వీరిలో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ వెల్లడించారు. వీరి వద్ద నుంచి 2 దేశీయ తుపాకులు, నాలుగు డమ్మీ తుపాకులు, ఏడు చరవాణులు, రెండు తల్వార్లు, కారు, స్కూటీ, రెండు వాకీటాకీలు, లేఖలు, ఒక బుల్లెట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ ఎడ్ల మహేష్, సీఐ జగదీశ్ ఉన్నారు