ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీకి సన్నాహాలు : ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి
మానకొండూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తొలి విడుతగా మండలానికో గ్రామాన్ని పైలెట్ గ్రామంగా ఎంపిక చేసి లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వగా, ఆయా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. పైలట్ గ్రామాలుగా మానకొండూర్ మండలం లో ముంజంపల్లి, శంకరపట్నం మండలంలో ఇప్పలపల్లి, తిమ్మాపూర్ మండలంలో కొత్తపల్లి, గన్నేరువరం మండలంలో గుండ్లపల్లి, బెజ్జంకి మండలంలో వీరాపూర్,ఇల్లంతకుంట మండలంలో సిరికొండ గ్రామాలు ఎంపికైనట్టు ఆయన వివరించారు. కాగా, పైలట్ గ్రామం మినహా మిగితా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకు చర్యలు వేగవంతం చేశామని, త్వరలోనే తేదీ ఖరారు చేసి ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.
0 Comments