అనంతగిరిలో సిసి కెమెరాల నిఘా: ప్రారంభించిన సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్ర చారి
న్యూస్ పవర్, 17 మార్చి , ఇల్లంతకుంట :
గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు మరియు నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని సిరిసిల్ల డిఎస్పీ కత్రోజు నాగేంద్ర చారి అన్నారు. మంగళవారం ఇల్లంతకుంట మండల పరిధిలోని అనంతగిరి గ్రామంలో గ్రామ సర్పంచ్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 17 సీసీటీవీ కెమెరాలను ఆయన రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.. గ్రామం మొత్తం కవర్ అయ్యే విధంగా వ్యూహాత్మక ప్రాంతాలలో ఈ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం వల్ల నేరస్తులను త్వరగా పట్టుకోవచ్చని, అలాగే ప్రజల్లో భద్రతా భావం పెరుగుతుందని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా భద్రతకు పెద్దపీట వేసిన సర్పంచ్ నవీన్ కుమార్ మరియు పాలకవర్గాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎస్సై అశోక్, విపిఓ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, గ్రామ పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

